మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

14, డిసెంబర్ 2012, శుక్రవారం

ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషకు జవసత్త్వాలు తిరిగి వచ్చేనా ? ---తూర్పింటి నరేశ్ కుమార్

తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన నా ప్రత్యేక వ్యాసం

ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషకు జవసత్త్వాలు తిరిగి వచ్చేనా ?
                                               -----తూర్పింటి నరేశ్ కుమార్

"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా - గతమెంతో ఘనకీర్తి గలవాడా "
...అన్న వేములలపల్లి శ్రీకృష్ణ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. క్రీ.శ. 1 వశతాబ్దిలో ' నాగబు ' శబ్దంతో మొదలైన తెలుగు సాహితీ ప్రస్థానం నన్నయ, తిక్కన ల కాలంలో మొగ్గలు తొడిగి కృష్ణరాయల కాలంలో స్వర్ణయుగంగా పేరొందినది.
20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుని 'సాహితీభారతి 'తనువు పులకరించిపోయింది.ఎంతో ఘన చరిత్ర కలిగినప్పటికినీ...ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే తెలుగు భాషా తేజం మసక బారుతున్నదా? అన్న సందేహం కలుగక మానదు. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం...మాతృభాషాపై తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల తెలుగు భాష క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోతున్నది.
మాతృభాషపై మమకారమేదీ....!!!!
"ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోనుండి
అమ్మ పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకు విందు
దేశభాషలందు తెలుగు లెస్స ".

అని మిరియాల రామకృష్ణ గారు పేర్కొన్నట్లుగా
: శిశువు తల్లి ఒడిలో పాలు తాగుతూ , తల్లి ముఖం నుండి నేర్చుకున్న భాషయే మాతృభాష. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాషయే! భూమిపై జన్మించిన జీవరాసుల్లో బుద్ధి జీవియే మానవుడు .
భాషా సామర్ధ్యం మిగతా జీవులనుండి అతడిని వేరుచేస్తుంది.
భాష అంటే ఒక జాతి చరిత్ర .
భాష అంటే ఆ జాతి జీవనాడి .
శరీరం పనిచేయడానికి హృదయం ఎంత అవసరమో ఒక జాతికి భాష అటువంటిదే అని ఘంటాపథంగా చెప్పవచ్చును. భాషను వదులుకుంటే మన చేజేతులా మన చరిత్రను , సంస్కృతిని మనమే నాశనం చేసుకున్నట్లే. మనిషికి మనస్సు ,మేధ ముఖ్యమైనవి . విద్య మనోవికాసాన్ని , మేధో వికాసాన్ని కలిగిస్తుంది. మనోవికాసానికి సాహిత్య విద్య
మేధో వికాసానికి శాస్త్రీయ విద్య అవసరం.
ఈ రెండింటికీ భాష మూలం.
అన్నం పెట్టేది అవసరానికి ఆదుకునేది ఈ ప్రపంచంలో 'భాష అన్నది జగమెరిగిన సత్యం .
జాతిని , సంస్కృతిని , మానవ సంబంధాలను రూపొందించేది మాతృభాషనే అన్న భావాన్ని
మొక్కగా ఉన్నప్పుడే బాల బాలికల్లో మనం నిర్మించగలగాలి. ఆంగ్లేయుల నుండి స్వేచ్ఛ పొంది 60 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ , వారి మానస పుత్రిక అనబడే ' 'ఆంగ్లభాష ' బారినుండి మనం తప్పించుకోలేకపోతున్నాం.ఈ కాలంలో ఇంగ్లీషు పై వ్యామోహం తగ్గక అది క్రమేపి పెరుగుతూ వస్తుంది. మనది త్రిభాషా సూత్రం. మన విద్యార్థులకు ఏ భాషా సరిగా తలకెక్కదు. మన భాషపై మనకు పట్టు సరిగా ఉండదు. చివరకు నేటి విద్యార్థి జీవితం " రెంటికి చెడ్డ రేవడిలా " భవిష్యత్ అగమ్యగోచరమవుతుంది. మాతృభాష తెలుగు గల విద్యార్థి ఎల్.కె.జి స్థాయినుండి ఆంగ్లంలో విద్యనభ్యసించినపుడు సహజంగా అతను తన భాషా విలువలను , మూలాలను మరిచిపోవడం ఖాయం. 'పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం లాంటిదని' విశ్వకవి రవీంద్రుడు పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. ఉన్నత సామాజిక హోదాకలవారు , గొప్ప గొప్ప చదువులు చదివిన వారు తమకు తమకు తెలుగు బొత్తిగా రాదని చెప్పుకోవడం " స్టేటస్ సింబల్ "గా భావిస్తున్నారనే  విషయం మాత్రం అక్షరసత్యం .
పరభాషా వ్యామోహంలో తన స్వరూపాన్ని కోల్పోతున్న మాతృభాష!
"సంస్కృతం లోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసి పోయె తేట తెలుగునందు " .

అని ఓకవి చెప్పినట్లుగా ...ఇతర భాషలలోని విశిష్ట లక్షణాలను తనలో ప్రోది చేసుకొని
వేల సంవత్సరాలనుండి తరతరాలుగా తన అస్థిత్వంను నిల్పుకుంటున్న తెలుగు భాష
21 వ శతాబ్దంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
అంటే తెలుగు రాష్ట్రమని , తెలుగు దేశమని , తీయనైన తెలుగు
తేట తేటల తెలుగు , దేశభాషలందు తెలుగు లెస్స ...వంటి వాక్యాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవని భావితరాలవారు చెప్పుకోవాల్సిన దుస్థితి ఇంక ఎంతో దూరంలో లేదు.
ఒక సర్వే ప్రకారం ...
"300 సంవత్సరాల తర్వాత తెలుగు భాష అనేది అసలే ఉండదనీ ,
ఆ కాలంలో మళ్ళీ పరిశోధనలు చేసి తెలుగు భాష ,లిపి ఇలా
డాక్టరేట్ పట్టాలు పొందే సౌలభ్యం కలదు.
పాలక వర్గాల విధాన నిర్ణయాలు , అలసత్వం , సరళీకరణ , ప్రభుత్వ ధోరణులు
కాన్వెంట్ నాగరికతకు బీజాలు వేసింది.వీటిల్లో అ , ఆ లకు బదులు ఎ , బి ,సి , డి లు నేర్పిస్తారు. ఇక్కడి ఇంగ్లీష్ మీడియం చదువులు మమ్మీ , డాడీ ల సంస్కృతి , ఆంటీ - అంకుల్ ల శకానికి పునాది రాళ్ళు లేస్తున్నాయని చెప్పవచ్చును. ఉదయమనగా ఇంటినుండి బయలుదేరిన 7 ఏళ్ళచిన్నారి సాయంత్ర సమయానికి మోయలేనిపుస్తకాల భారంతో , అలసిపోయిన ముఖంతో ఇంటికి వచ్చి 'మమ్మీ ' అని పిలుస్తాడు. మమ్మీ అనగానే తల్లులు తమ చిన్నారి ఇంగ్లీష్ లో పిలుస్తున్నాడని మహానందపడి చంకలు గుద్దేసుకుంటారు.
కాని మమ్మీలు అనగా ఈజిప్ట్ భాషలో ' శవాలు ' అని ఎంత మంది తల్లిదండ్రులకు తెలుసు?
ఈ మమ్మీడాడీల కల్చర్ మధ్య తరగతి నుండి దిగువ మధ్య తరగతికి శరవేగంగా వ్యాపిస్తోంది. .
కార్పోరేట్ కల్చర్ , పోష్ నడవడిక , ప్రతీ చిన్న విషయంలో పాశ్చాత్యీకరణకై అర్రులు చాచడం
పబ్ లో 'హగ్ ' లు ...డిస్కోథెక్ లలో 'బెల్లీ డ్యాన్సులు' .... పార్టీలలో 'పార్టీ ' లకై సెర్చింగ్ లు... హైటెక్కులు... డాలర్ కలలు ...వెరసి యువతకు తమ మాతృభాష అంటేనే అదో బ్రహ్మపదార్థంలా వింతగ చూసే పరిస్థితి నేడు నెలకొన్నది.
గరిమెళ్ళ సత్య నారాయణ గారు అన్నట్లుగా ...............................

"ఇంగ్లీషు లేకుంటె ఇహలోకము లోన
ఎవ్వడైనా బ్రతుకగలడా
గువ్వలా బువ్వ తినగలడా
ఆంగ్ల జవ్వనులతో షేకుహాండులు పొందగలడా!
అన్నది ఇక్కడ గమనార్హం ?!
నవతరం తల్లిదండ్రులు పిల్లలకు వారి యిష్టాయిష్టాలతో
ప్రమేయం లేకుండానే బలవంతగా పోటీ పరీక్షలు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు .
6వ తరగతి లోనే IIIT పౌండేషన్ చదువులు .... హావ్వ !ఇదేమి చోద్యం నక్కకు నాకలోకానికి
పొంతన కుదురుతుందా?
బలవంతమైన బరువు చదువులు విద్యా ర్థుల బాల్యాన్ని కుంగదీస్తున్నాయి .
పసి వయస్సులో ఫౌండేషన్ కోర్సులు కోర్సులు, పుస్తకాల మోతలు విద్యార్థికి
పెనుభారంగ పరిణమిస్తోంది.
చదువుల్లొ ఆటవిడుపులు లేక ,గమ్యాన్ని చేరు కోలేక ,మానసిక ఒత్తిడులు తట్టుకోలేని
కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నేడు నెలకొన్నది .
తెలుగు భాషాభివృద్ధికి సూచనలు :
1. ఆం.ప్ర. లోని ప్రతి షాపు పేరు ఖచ్చితంగా తెలుగులోనే ఉండాలి
2) కార్పొరేట్, ఇతర కళాశాలల్లో ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ద్వితీయ భాషగా తెలుగును భోధించాలి.
 3. డిగ్రీ కళాశాలల్లో కూడా తప్పనిసరిగా తెలుగును ద్వితీయగా నిర్భంధంగా అమలు చేయాలి.
డిగ్రీ స్థాయిలో తెలుగు ను కూడ మార్కుల శాతంలో కలపాలి. తెలుగు కు ప్రాక్టికల్సు కూడ నిర్వహించాలి.
4. తెలుగు పరిశోధక విద్యార్థులకు గౌరవ వేతనం ఇవ్వాలి.
5. తెలుగు మాధ్యమంలో పీ.జి. చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ ను కల్పించాలి.
6. అమ్మ, నాన్న,అత్తయ్య,మావయ్య,అన్నయ్య,అక్కయ్య అని పలకడం లో ఉండే మాధుర్యాన్ని
                                                                    నేటి తరానికి వివరించాలి .
7. ప్రాంతాలు వేరైనా,మతాలు వేరైనా ఇకమత్యంతో తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం .
ముగింపు :
తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులెల్ల యెరుగనే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స..... 

  ముగింపు :
తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులెల్ల యెరుగనే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స.....
అన్న పలుకులు అను నిత్యం ప్రతి తెలుగు వాకిళ్ళలో పలకాలంటే తెలుగు వాడి వాక్కు విను వీధుల్లో విహరించాలంటే ప్రతి భాషాభిమాని తన వంతు ప్రయత్నంగా తెలుగు భాషాభివృద్ధికి ఉడతా భక్తిగా తన వంతు కృషి చేయాలి.